Andhra Pradesh: చంద్రబాబు ‘జశోదా బెన్’ వ్యాఖ్యలు.. ఏపీ సీఎంను తప్పుపట్టిన మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు!

  • నిన్న గుంటూరులో మోదీ సభ
  • ఏపీ సీఎం, లోకేశ్ పై విమర్శల వర్షం
  • దీటుగా కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీల మధ్య నిన్న మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ పై ప్రధాని విమర్శలు గుప్పించగా, చంద్రబాబు సైతం మోదీకి ఘాటుగా కౌంటర్ వేశారు. తాను లోకేశ్ తండ్రిని అయితే, మోదీ జశోదాబెన్ భర్త అని వ్యాఖ్యానించారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిని బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు.

ప్రధాని మోదీ కేవలం వారసత్వ రాజకీయాల గురించి మాత్రమే ప్రస్తావించారని ఐవైఆర్ స్పష్టం చేశారు. ఈరోజు ట్విట్టర్ లో కృష్ణారావు స్పందిస్తూ..‘మోదీ గారు తన ఉపన్యాసంలో ప్రస్తావించింది వారసత్వ రాజకీయాల గురించి మాత్రమే. రాజకీయాలలో ఉన్నారు కాబట్టి తండ్రీకొడుకుల ప్రస్తావన తెచ్చారు. ముఖ్యమంత్రి గారు రాజకీయాలలో లేని వారి కుటుంబసభ్యుల ప్రస్తావన తీసుకురావడం అంత సబబని అనిపించడం లేదు’ అని ట్వీట్ చేశారు. కాగా, ఐవైఆర్ ట్వీట్ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

More Telugu News