Hyderabad: భార్య, రెండున్నర నెలల కుమారుడిని దారుణంగా చంపి పెట్రోలు పోసి తగలబెట్టిన భర్త.. హైదరాబాద్‌ శివారులో ఘటన

  • ప్రేమించి పెళ్లాడిన వాడే దారుణంగా చంపేశాడు
  • భార్య, కుమారుడిని చంపి పోలీసులకు లొంగిపోయిన భర్త
  • పరువు హత్యేనంటున్న బాధిత కుటుంబ సభ్యులు

ఈ వార్త చదివాక మనుషులు మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అన్న ఆలోచన వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది దుర్మార్గానికే దుర్మార్గమైన ఘటన. తను పెట్టే వేధింపులు భరించలేక దూరంగా ఉంటున్న భార్యను మాట్లాడదామని పిలిపించి అత్యంత దారుణంగా హత్యచేశాడో భర్త. అంతేకాదు, భార్య సహా ముక్కుపచ్చలారని, లోకంపోకడ తెలియని తన రెండున్నర నెలల కుమారుడిని కూడా పాశవికంగా హత్యచేశాడు. విషయం తెలిసి అందరి గుండెలు బరువెక్కి పోయాయి.

పోలీసుల కథనం ప్రకారం..  జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన మచ్చల రమేశ్‌(27) హైదరాబాద్‌లో కార్పెంటర్‌. వరంగల్‌ రూరల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంటకు చెందిన కండిగ శుశ్రుత(26) హైదరాబాద్‌లో బీఫార్మసీ చేస్తున్నప్పుడు రమేశ్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు, ఆపై సహజీవనానికి దారి తీసింది. ఈ క్రమంలో శుశ్రుత గర్భం దాల్చింది.

అయితే, వీరి పెళ్లికి రమేశ్ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇటీవల మూడు రోజులపాటు రమేశ్ ఇంటిముందు శుశ్రుత ఆందోళన కూడా నిర్వహించింది. పెళ్లిని అంగీకరించని పెద్దలు అతడిని గృహ నిర్బంధంలో ఉంచారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే, శుశ్రుత ఆందోళనతో దిగొచ్చిన రమేశ్ కుటుంబం ఇద్దరికీ పెళ్లి చేసింది. 2015లో ఒక్కటైన రమేశ్-శుశ్రుతలు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు.

సజావుగా సాగిపోతున్న వీరి జీవితంలోకి రమేశ్ కుటుంబ సభ్యులు మరోమారు ప్రవేశించారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రేకెత్తాయి. ఎనిమిది నెలల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికే గర్భిణి అయిన శుశ్రుత రెండున్నర నెలల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది.  

రమేశ్ నుంచి వెళ్లిపోయిన అనంతరం పుట్టింటిలో ఉంటున్న శుశ్రుతకు శనివారం మాట్లాడే పని ఉందంటూ రమేశ్ కబురు పెట్టాడు. రెండున్నర నెలల బాబును పట్టుకుని బంధువుతో కలిసి ఉప్పల్ డిపో వద్దకు చేరుకున్న భార్యను కలిసిన రమేశ్ తామిద్దరం మాట్లాడుకునే పని ఉందంటూ బంధువును అక్కడే వదిలేసి భార్యను తన బైక్‌పై తీసుకెళ్లాడు.

ఘట్‌కేసర్ సమీపంలోని రింగ్‌రోడ్డు వద్దకు తీసుకెళ్లి బైక్ ఆపిన రమేశ్ భార్యతో గొడపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి భార్య, కుమారుడిని కిరాతకంగా చంపేశాడు. అనంతరం పాలకుర్తి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. అక్కడ పోలీసులకు చెప్పిన వివరాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

శనివారం రాత్రి ఇద్దరికీ గొడవ జరిగిందని, దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి బాబుతో కూడా ఒకటి మింగించిందని పోలీసులకు చెప్పాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ రాత్రి 9 గంటల వేళ బైక్‌పై కొండాపూర్ తీసుకెళ్లి ఇద్దరి గొంతు నులిమి చంపేశానని చెప్పాడు. అనంతరం వారిద్దరిపై పెట్రోలు పోసి తగలబెట్టానని వివరించాడు.

పాలకుర్తి పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఘట్‌‌కేసర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ బూడిద, కాలిన ఎముకలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రమేశ్ చెప్పిన దాంట్లో నిజమెంత? అన్న విషయమై ఆరా తీస్తున్నారు. ఈ హత్యల విషయంలో రమేశ్‌కు ఇంకెవరైనా సాయం అందించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుశ్రుత కుటుంబ సభ్యులు ఇది పరువు హత్యేనని ఆరోపిస్తున్నారు.

More Telugu News