Karnataka: అవును, ఆ ఆడియో టేపులో గొంతు నాదే: అంగీకరించిన యడ్యూరప్ప

  • తొలుత తన గొంతు కాదన్న యడ్యూరప్ప
  • యూ-టర్న్ తీసుకున్న మాజీ సీఎం
  • కుతంత్ర రాజకీయాలు నడిపారని ఆరోపణ

కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు తనది కాదని, అది తన గొంతేనని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప యూ-టర్న్‌ తీసుకున్నారు. ఆ ఆడియోలో గొంతు తనదేనని జేడీఎస్‌ ఎమ్మెల్యే శరణగౌడను కుమారస్వామే తన వద్దకు పంపించాడని, కుతంత్ర రాజకీయాలు నడిపి, ఆడియో రికార్డు చేయించారని ఆరోపించారు. ఒరిజినల్ ఆడియోను కుమారస్వామి విడుదల చేయలేదని, ఎడిట్‌ చేసిన ఆడియోను మాత్రమే విడుదల చేశారని అన్నారు. పూర్తి ఆడియోను తాను విడుదల చేయనున్నానని చెప్పారు.

తమది సూట్‌ కేస్‌ సంస్కృతి పార్టీ అనీ... సూట్‌ కేస్‌ లేకుంటే ఏ పని జరగదంటూ కుమారస్వామి కుటుంబీకుడు, మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ మాట్లాడిన వీడియోను తాను ప్రజలకు చూపిస్తానని అన్నారు. ఇదిలావుండగా, బీజేపీ నేత విజూగౌడ పాటిల్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం కుమారస్వామి రూ. 25 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో నేడో, రేపో బయటకు వస్తుందన్న ప్రచారం కర్ణాటకలో జరుగుతోంది.

More Telugu News