Andhra Pradesh: నన్ను కెలకవద్దు.. కెలికారో.. మీ బొక్కలన్నీ బయటపెడతా!: నటుడు శివాజీ వార్నింగ్

  • విజయవాడలో జలదీక్షలో నటుడు
  • మోదీ రాకతో ఏపీ అపవిత్రమయిందని వ్యాఖ్య
  • సంఘీభావం తెలిపిన కారెం శివాజీ

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు నిరసనగా ఈరోజు అధికార టీడీపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీనటుడు శివాజీ విజయవాడలోని కృష్ణా నదిలో జలదీక్షకు దిగారు. నడుము లోతు నీటిలో దిగి ప్లకార్డులతో మోదీ గో బ్యాక్, మోదీ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. మోదీ రాకతో ఏపీ అపవిత్రం అయింది కాబట్టే తాను కృష్ణా నదిలో జలదీక్ష చేస్తున్నానని తెలిపారు.

‘నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. నన్ను కెలకవద్దు. నన్ను కెలికితే మీ బొక్కలు మొత్తం బయటపెడతా’ అని శివాజీ రాజకీయ నేతలను హెచ్చరించారు. మోదీ ప్రధాని కాదనీ, ఆయన రాజకీయ తీవ్రవాది అని విమర్శించారు. దేశంలో దుర్మార్గమైన రాజకీయాలు చేయడానికే ఆయన వచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ, దాని అనుబంధ పార్టీలు ప్రజలను మోసం చేశామని అనుకుంటున్నాయనీ, ప్రజలు అమాయకులు కాదని స్పష్టం చేశారు.

మోదీ కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోదీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లేవరకూ తన జలదీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, శివాజీ దీక్షకు ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సంఘీభావం తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు.

More Telugu News