Andhra Pradesh: బీజేపీ కార్యకర్తలు గట్టిగా ఓసారి అరిస్తే టీడీపీ కోటలు కూలిపోతాయి!: జీవీఎల్ హెచ్చరిక

  • మోదీ, బీజేపీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు
  • సభకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారు
  • చంద్రబాబు దొంగ అరుపులు అరుస్తున్నారు

టీడీపీ ప్రభుత్వం మాయమాటలతో బీజేపీ, ప్రధాని మోదీలపై దుష్ప్రచారం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే నిధులను ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గుంటూరు సభకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఎంత అణగదొక్కాలని చూస్తే అంత ఎగిసిపడే తత్వం బీజేపీదని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలంతా ఒక్కసారి గట్టిగా అరిస్తే ఆ దెబ్బకు టీడీపీ కోటలు కూలిపోతాయని ఎద్దేవా చేశారు.

గుంటూరులో మోదీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన వివిధ ప్రాజక్టులకు కేంద్రం కేటాయించిన నిధులను చంద్రబాబు వాటికి ఖర్చు పెట్టకుండా, వేరే ప్రాజక్టులకు వాడుకుని, ఇప్పుడు దొంగ అరుపులు అరుస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు కేంద్ర విద్యాసంస్థల కోసం వేల కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందన్నారు. ఇంత చేసినా ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రేపటి ప్రధాని పర్యటనను అడ్డుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. టీడీపీ నేతలకు అడ్డుకోవడం తెలిస్తే.. ప్రతిఘటించడం బీజేపీకి తెలుసని స్పష్టం చేశారు.

More Telugu News