Karnataka: కుప్పకూలిన ఇంటి పైకప్పు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి సజీవ సమాధి!

  • కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘటన
  • పాత కాలం నాటి ఇంట్లో నివాసం   
  • ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృత

ఇంటి కప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ సమాధి అయ్యారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని  రామజోగిహళ్లిలో ఓ కుటుంబం నివాసముంటోంది. అయితే ఈ ఇల్లు పాతది కావడంతో ఈరోజు ఇంటి కప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు వారి తల్లి నాగరత్నమ్మ ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో రామజోగిహళ్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

More Telugu News