Telugudesam: టీడీపీ నేతలు కిడారి, సివేరిల హత్య కేసు.. కీలక నిందితుడు ‘డొండురు కిలో’ అరెస్ట్!

  • అరెస్ట్ చేసిన ఒడిశా కోరాపుట్ పోలీసులు
  • ఎన్ఐఏ అధికారులకు అప్పగింత
  • గతేడాది సెప్టెంబర్ 23న నేతల హత్య

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి హత్యల్లో కీలకంగా వ్యవహరించిన డొండురు కిలోను ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువా అటవీప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులకు నిందితుడిని అప్పగించారు.

ఇతను నందాపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మన్యం ప్రాంతంలో మైనింగ్ ను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను గతేడాది సెప్టెంబర్ 23న కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ కేసును తొలుత విచారించిన ఏపీ పోలీసులు సుబ్బారావు, శోభన్,ఈశ్వరి, కొర్ర కమల అనే మావోయిస్టులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును ఏపీ పోలీసులు ఎన్ఐఏకు బదిలీ చేశారు.

More Telugu News