Telangana: మోదీ, కేసీఆర్, జగన్.. వీళ్లందరూ చంద్రబాబుకు కలలోకి వస్తున్నారు!: టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి

  • బాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
  • ఆయనకు ఓటమి భయం పట్టుకుంది
  • నల్గొండలో మీడియాతో టీఆర్ఎస్ నేత

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. అసహనం, ఈర్షతో చంద్రబాబు తెలంగాణపై విరుచుకుపడుతున్నారని దుయ్యబట్టారు. ఆయనకు ఓటమి భయం పట్టుకుందన్నారు. నల్గొండలోని తన నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుత్తా మాట్లాడారు.

మోదీ, కేసీఆర్, జగన్ వీళ్లందరూ చంద్రబాబుకు కలలోకి వస్తున్నారనీ, వాళ్ల పేర్లు వింటేనే ఆయన ఉలిక్కిపడుతున్నారని సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వాళ్లు లేరని విమర్శించారు. చంద్రబాబు పాలన తొందరలోనే అంతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

మోసం, కుట్రలు అన్నవి చంద్రబాబుకు మారుపేరు లాంటివని దుయ్యబట్టారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే వైసీపీ అధినేత జగన్ ను కలిశామనీ, అందులో తప్పేముందని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకు కూడా ఉంటే బాగుంటుందని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 

More Telugu News