Andhra Pradesh: అనంతపురం జిల్లాలో దారుణం.. అక్కపై కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు!

  • ఏపీలోని పొడరాళ్ల గ్రామంలో ఘటన
  • బాధితురాలికి 50 శాతం కాలిన గాయాలు
  • వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు

సోదరితో గొడవ పడ్డ ఓ మైనర్ బాలుడు దారుణానికి తెగబడ్డాడు. క్షణికావేశంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలిక ప్రస్తుతం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం పొడరాళ్ల గ్రామంలో బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే మైనర్లు అయిన అక్కాతమ్ముళ్లు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఈరోజు కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చుట్టపక్కల వారు వీరిని సముదాయించి పంపారు. ఇంట్లో మరోసారి గొడవ జరగడంతో సహనం కోల్పోయిన తమ్ముడు అక్కపై పెట్రోల్  పోసి నిప్పంటించాడు.

దీంతో మంటలకు తాళలేక బాధితురాలు హాహాకారాలు చేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు మంటలను ఆర్పి బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. బాలికకు 50 శాతం కాలిన గాయాలు అయ్యాయనీ, ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 

More Telugu News