nitin gadkari: లోక్ సభలో ఆసక్తికర సన్నివేశం.. గడ్కరీని అభినందిస్తూ బల్లను చరిచిన సోనియా!

  • ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ శాఖ పనితీరుపై చర్చ
  • పార్టీలకతీతంగా ఎంపీలందరూ తన శాఖ పనితీరును ప్రశంసిస్తున్నారన్న గడ్కరీ
  • బల్ల చరిచి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ సభ్యులు

కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పనితీరుపై లోక్ సభలో ప్రశంసలు కురిశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ శాఖపై రెండు ప్రశ్నలను స్పీకర్ చర్చకు స్వీకరించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, 'పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడున్న అందరు ఎంపీలు వారి నియోజకవర్గాల్లో తన శాఖ ద్వారా జరిగిన పనులపై ప్రశంసిస్తున్నారు' అని తెలిపారు. వెంటనే బీజేపీ సభ్యులంతా బల్లలను చరుస్తూ అభినందనలను తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ లేచి నిలబడి... గడ్కరీ కృషికి సభ అభినందనలు తెలపాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ ను కోరారు.

వెంటనే లోక్ సభలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అప్పటిదాకా గడ్కరీ చెబుతున్న విషయాలను ఎంతో ఓపికగా వింటున్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ... గడ్కరీని అభినందిస్తూ బల్లను చరిచారు. ఆ తర్వాత లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలందరూ బల్లను చరుస్తూ గడ్కరీని అభినందించారు.

ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గంలో ఉన్న రహదారుల సమస్యపై సానుకూలంగా స్పందించారంటూ గత ఆగస్టులో ధన్యవాదాలు తెలుపుతూ గడ్కరీకి సోనియా లేఖ రాశారు. 'ఇంటిని సరిగా చూసుకోలేనివారు.. దేశాన్ని ఎలా మేనేజ్ చేస్తారు' అంటూ ఇటీవల గడ్కరీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కూడా ప్రశంసించిన సంగతి తెలిసిందే. బీజేపీలో గట్స్ ఉన్న నేత మీరు మాత్రమేనంటూ గడ్కరీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. 

More Telugu News