Chennai: భార్య వివాహేతర సంబంధం.. ముక్కలుగా నరికిచంపిన తమిళ సినీ సహాయ దర్శకుడు!

  • భార్య ప్రవర్తనపై అనుమానం
  • ప్రియుడితోనే ఉంటానన్న భార్య
  • విచక్షణ రహితంగా భార్యను నరికిచంపిన భర్త

భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన తమిళ సినీ సహాయ దర్శకుడు ఆమెను ముక్కలుగా నరికి చంపాడు. తమిళనాడులోని చెన్నై శివారులో జరిగిన ఈ ఘటనలో రెండు వారాల తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 21న పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో ఓ యువతికి చెందిన కాళ్లు, చేయిని గుర్తించారు. ఆమె ఎవరన్నది తెలుసుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి చెన్నైలోని ఈక్కాడుతాంగల్‌లో ఉంటున్న నాగర్‌కోవిల్‌కు చెందిన సంధ్య (38)గా గుర్తించారు.  

సినిమాల్లో నటించే సహాయ నటి అయిన సంధ్య గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె భర్త, సహాయ దర్శకుడు అయిన బాలకృష్ణన్‌ (51)ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతడు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. సంధ్య రాత్రుళ్లు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుతుండడం, అస్తమాను బయటకు వెళ్తుండడంతో ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని బాలకృష్ణ అనుమానించాడు.

 ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ విషయంలో భార్యను పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమె వినిపించుకోకపోగా, తాను ప్రియుడితోనే ఉంటానని సంధ్య తేల్చి చెప్పింది. దీంతో గత నెల 19న దంపతులిద్దరూ మరోమారు గొడవ పడ్డారు. దీంతో సహనం కోల్పోయిన బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు.

More Telugu News