Kerala: 'శబరిమల' తీర్పు రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ

  • 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలపై నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీం కోర్టు
  •  పిటిషన్‌ దాఖలు చేసిన నాయర్‌ సర్వీస్‌ సొసైటీ
  • వాదనలు వింటున్న సీజే  ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం

కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణ ఈరోజు ప్రారంభమైంది. తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ నాయర్‌ సర్వీస్‌ సొసైటీ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మహిళలపై ఆంక్షలు విధించడం అంటే లింగ వివక్షను ప్రోత్సహించడమే అని పేర్కొంటూ, నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు సెప్టెంబర్‌ 28వ తేదీన తీర్పు ఇచ్చింది. దాంతో వందల ఏళ్లనాటి ఆలయ సంప్రదాయాన్ని పక్కన పెడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.

ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మొత్తం 64 పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలు కాగా, అందులో నాయర్‌ సొసైటీ ఒకటి. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం ముందు పిటిషనర్‌ తరపు న్యాయవాది కె.ప్రసరణ్‌ తన వాదనలు వినిపించారు.

More Telugu News