Hardhik Pandya: అరుదైన చాన్స్ కొట్టేసిన పాండ్యా సోదరులు!

  • తొలి టీ-20లో ఆడనున్న కృనాల్, హార్దిక్
  • అమర్ నాథ్, పఠాన్ సోదరుల తరువాత పాండ్యాలకు చాన్స్
  • నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్

అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన కెరీర్ ను ప్రమాదంలో పడేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన సోదరుడితో కలిసి ఓ అరుదైన చాన్స్ అందుకున్నాడు. నేడు న్యూజిలాండ్ తో జరిగే టీ-20 మ్యాచ్ లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, యువ ఆటగాళ్లకు స్థానం ఇచ్చి చూడాలని జట్టు మేనేజ్ మెంట్ భావించింది. హార్దిక్ పాండ్యాతో పాటు అతడి సోదరుడు కృనాల్ పాండ్యాకు కూడా తొలి మ్యాచ్ లో అవకాశం దక్కింది.

అయితే, భారత జట్టుకు ఇద్దరు సోదరులు ఆడటం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలో మొహిందర్ అమర్‌ నాథ్ - సురీందర్ అమర్‌ నాథ్, ఇర్ఫాన్ పఠాన్ - యూసఫ్ పఠాన్ లు ఆడగా, ఇప్పుడు వారి సరసన హార్దిక్ - కృనాల్ జత కలవబోతున్నారు. వీరిద్దరూ ముంబై ఇండియన్స్ తరఫున గత మూడు సంవత్సరాలుగా కలిసే ఆడుతున్నారన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను గెలుచుకున్న ఆనందంలో ఉన్న భారత జట్టు, టీ-20 సిరీస్ ను కూడా గెలుచుకోవాలన్న కృతనిశ్చయంతో ఉంది.

More Telugu News