illegal affair: మేనల్లుడితో వివాహేతర సంబంధం.. అతనితో కలసి భర్తను హతమార్చిన మహిళ!

  • సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • నిద్రమత్తులో ఉన్న భర్తపై బండరాయితో దాడి
  • బోరబండ రైల్వే ట్రాక్ పక్కన పడేసిన మృతదేహం

వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తన భర్తను హతమార్చిన దారుణ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. సంగీత, శ్రీనివాస్ భార్యాభర్తలు. శ్రీనివాస్ రైల్వే ఉద్యోగి. సంగీత తన మేనల్లుడు విజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ తన భార్యను తరచుగా హెచ్చరించేవాడు.

ఈ క్రమంలో ఆమెపై వేధింపులకు పాల్పడేవాడు. దీంతో, తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సంగీత భావించింది. విజయ్ తో కలిసి ఈ హత్యకు పథకం వేసింది. శ్రీనివాస్ కు విద్యుత్ షాక్ ఇచ్చి హత మార్చాలని ఆమె చెప్పింది. కానీ, అలా కాకుండా వేరే మార్గంలో హతమారుద్దామని విజయ్ సలహా ఇచ్చాడు. రైల్వే ట్రాక్ పక్కనే సంగీత నివాసం ఉండటంతో వీరికో ఆలోచన వచ్చింది. రైలు వచ్చే సమయంలో నిద్రిస్తున్న తన భర్త తలపై బండరాయితో మోదాలని నిర్ణయించారు. రైలు శబ్దంలో తన భర్త అరుపులు బయటకు వినపడకుండా ఉంటాయని వేసిన ఈ ప్లాన్ ని ఇద్దరూ పక్కాగా అమలు చేశారు.

శ్రీనివాస్ ని హతమార్చిన అనంతరం, ఆ మృతదేహాన్ని బోరబండ రైల్వేట్రాక్ పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయాలు బయటకొచ్చాయి. శ్రీనివాస్ తమ్ముడిని పోలీసులు విచారణ చేయగా, తన వదిన సంగీతపై అతను అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులు సంగీత, విజయ్ ను అరెస్టు చేశారు.  

కాగా, సంగీత బీఈడీ పూర్తి చేసింది. ఇటీవలే ఎస్సై పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైంది. కాబోయే మహిళా ఎస్సై ఈ దారుణానికి పాల్పడటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

More Telugu News