jana sena: ‘జనసేన’లో చేరిన కేవీ విష్ణురాజు.. పార్టీ కండువా కప్పిన పవన్ కల్యాణ్

  • డాక్టరు బీవీ రాజు ఫౌండేషన్ చైర్మన్ విష్ణురాజు
  • విష్ణు రాజుని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా
  • అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్ గా ఆయన్ని నియమిస్తున్నా: పవన్ కల్యాణ్

ఏపీకి చెందిన ప్రముఖ విద్యావేత్త కేవీ విష్ణు రాజు ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విష్ణురాజుకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేన లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, భీమవరంలోని డాక్టరు బీవీ రాజు ఫౌండేషన్ చైర్మన్ అయిన విష్ణురాజుని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. ఆయన తమ కళాశాలను నడిపే విధానం తనను అమితంగా ఆకట్టుకుందని అన్నారు. పాలసీ మేకింగ్, పార్టీకి దిశానిర్దేశం విషయంలో గానీ తన పాత్ర ఉంటుందని విష్ణు రాజు చెప్పడంతో పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు. జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్ గా విష్ణురాజుని నియమిస్తున్నట్టు ప్రకటించారు.

పార్టీ అభివృద్ధికి విష్ణురాజు తోడ్పడతారని ఆశిస్తున్నా: నాదెండ్ల మనోహర్

సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి కేవీ విష్ణురాజు అని, ఇటువంటి వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్ ని ప్రశంసిస్తున్నానని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ అభివృద్ధికి విష్ణురాజు తోడ్పడతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

‘జనసేన’ టీమ్ కు,పవన్ కల్యాణ్ కు పూర్తిగా సహకరిస్తా: విష్ణు రాజు

రెండు, మూడు సార్లు పవన్ కల్యాణ్ ని కలిశానని, సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన ఆయనకు ఉందని విష్ణు రాజు అన్నారు. పవన్ కల్యాణ్ పాలసీ, ఫిలాసపీ తనకు బాగా నచ్చిందని, రాష్ట్రం కోరుకుంటే మంచి మార్పు తీసుకొచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అన్నారు. పవన్ కల్యాణ్, జనసేన టీమ్ కు తాను పూర్తిగా సహకరిస్తానని, తన సేవలు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతాయో అలా ఉపయోగించుకోవాలని కోరారు.

More Telugu News