krish: క్రిష్ చేస్తున్న గొడవకు కారణం ఇదే: కంగనా రనౌత్

  • విడుదలకు ముందే సినిమాను క్రిష్ కు చూపించాలనుకున్నాం
  • అప్పటికే సినిమాపై ఆయన నమ్మకాన్ని కోల్పోయారు
  • ఇప్పుడు సినిమా నచ్చడంతో... ఇది నా సినిమానే అంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు

'మణికర్ణిక' సినిమా నేపథ్యంలో దర్శకుడు క్రిష్, బాలీవుడ్ నటి కంగన రనౌత్ ల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సినిమా చాలా వరకు తెరకెక్కిన తర్వాత దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ వైదొలగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తానే దర్శకురాలిగా వ్యవహరించి సినిమాను కంగన పూర్తి చేసింది.

ఈ నేపథ్యంలో, 70 శాతం వరకు సినిమాను తానే తెరకెక్కించానని పలు ఇంటర్వ్యూలలో క్రిష్ చెప్పాడు. మరోవైపు సినిమా హిట్ క్రెడిట్ తనదే అనేట్టుగా కంగన వ్యాఖ్యానిస్తోంది. వీరిద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలు బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్, నటుడు సోనూసూద్ లపై కంగన మరోసారి విమర్శలు గుప్పించింది. విడుదలకు ముందే డిసెంబర్ లో సినిమాను క్రిష్ కు చూపించాలనుకున్నామని... కానీ, అప్పటికే ఆయన సినిమాపై నమ్మకాన్ని కోల్పోయారని తెలిపింది. తామంతా కలసి సినిమాను నాశనం చేశామనే భావనలో ఆయన ఉన్నారని చెప్పింది.

విడుదల తర్వాత సినిమా నచ్చడంతో...  'ఇది నా సినిమానే' అంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారని విమర్శించింది. మీడియా ముందు క్రిష్ గొడవ చేయడం సరికాదని... నేరుగా నన్ను కలవొచ్చు కదా? అని ప్రశ్నించింది. సోనూసూద్ కు ఈ సినిమా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని... ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. వీళ్లంతా కలసి తన సినిమాను నాశనం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తింది. 

More Telugu News