West Bengal: తమ్ముడికి ఉద్యోగం వచ్చిందన్న అసూయతో ఇంటికి నిప్పంటించిన అన్న.. నలుగురి మృతి!

  • తమ్ముడికి ఉద్యోగం రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన అన్న
  • చావుబతుకుల్లో మరికొందరు
  • పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఘటన

సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న అక్కసుతో ఇంటికి నిప్పుపెట్టి తోడబుట్టిన ఇద్దరు సోదరులను పొట్టనపెట్టుకున్నాడో కర్కశుడు. పశ్చిమ బెంగాల్‌లోని మల్దా జిల్లా మానిక్‌చక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. మదన్‌తోలాకు చెందిన మఖాన్ మోందల్, గోవిందా (28), వికాశ్ (32)లు అన్నదమ్ములు. సోదరులందరూ కలిసి తల్లితో నివసిస్తున్నారు. కారుణ్య నియామకాల్లో భాగంగా ఇటీవల గోవిందాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. విషయం తెలిసి మఖాన్ జీర్ణించుకోలేకపోయాడు. అక్కసుతో రగిలిపోయాడు.

దీంతో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పెట్రోలు పోసి పెంకుటింటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో తమ్ముడు గోవిందా, అతడి ఇద్దరు కుమార్తెలు, అన్న వికాశ్ సజీవ దహనమయ్యారు. వికాశ్ భార్య, కుమారుడు, కుమార్తె, గోవిందా భార్య మల్దా మెడికల్ కళాశాలలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మరో గదిలో నిద్రించడంతో తల్లి, పుట్టింటికి వెళ్లడంతో మఖాన్ భార్య ప్రమాదం నుంచి బయటపడగలిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News