TRS: ఎంపీ కవితకు అరుదైన గౌరవం.. కేరళ అసెంబ్లీ నుంచి ఆహ్వానం

  • ఈ నెల 23న కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
  • ‘క్యాస్ట్ అండ్ ఇట్స్ డిస్ కంటెంట్స్’పై కవిత ప్రసంగం
  • ఈ సదస్సును ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి

టీఆర్ఎస్ ఎంపీ కవితకు అరుదైన గౌరవం లభించింది. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి 25 వరకు సదస్సు జరగనుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ కవితకు ఆహ్వానం అందింది. ఈ మేరకు కేరళ అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ ఓ లేఖ రాశారు.

ఈ నెల 23న దేశంలోని యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులతో నిర్వహించనున్న ఈ సదస్సుకు రావాలని, అదే రోజు మధ్యాహ్నం నిర్వహించే సదస్సులో ‘క్యాస్ట్ అండ్ ఇట్స్ డిస్ కంటెంట్స్’ అంశంపై ప్రసంగించాలని కవితను ఆహ్వానిస్తూ ఈ లేఖ రాశారు. కేరళ సీఎం పినరయి విజయన్ సహా వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సామాజికంగా, రాజకీయంగా, క్రియాశీలకంగా ఉన్న రెండు వేల మంది జాతీయ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొననున్నట్టు ఆ లేఖలో తెలిపారు. కాగా, ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.

More Telugu News