West Bengal: పశ్చిమబెంగాల్ లోకి సాయుధ కేంద్ర బలగాలను పంపేందుకు అనుమతించండి: ఈసీని కోరిన బీజేపీ

  • బెంగాల్ లో శాంతిభద్రతలు వేగంగా పతనమవుతున్నాయి
  • రాష్ట్ర అధికారులు టీఎంసీ ఏజెంట్లుగా పని చేస్తున్నారు
  • కేంద్ర ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయి

బీజేపీకి, పశ్చిమబెంగాల్ లోని మమత ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. కోల్ కతాలో సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, ఈరోజు బీజేపీకి చెందిన హైలెవెల్ టీమ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. బెంగాల్ లో శాంతిభద్రతలు వేగంగా పతనమవుతున్నాయని... ఈ నేపథ్యంలో సాయుధ కేంద్ర బలగాలను ఆ రాష్ట్రంలోకి పంపేందుకు అనుమతించాలని ఈసీని బీజేపీ కోరింది. ఈసీని కలిసిన వారిలో నిర్మలా సీతారామన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఎస్ఎస్ అహ్లూవాలియా, భూపేంద్ర యాదవ్, బీజేపీ వెస్ట్ బెంగాల్ ఇన్ ఛార్జ్ కైలాష్ విజయవర్గీయ తదితరులు ఉన్నారు.

ఈసీతో భేటీ అనంతరం మీడియాతో నఖ్వీ మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న తీవ్ర పరిణామాలను గమనించాలని ఈసీని కోరామని చెప్పారు. రాష్ట్ర అధికారులు ప్రభుత్వ ఏజెంట్లుగా పని చేస్తున్నారని... వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రంలో మోహరింపజేసేందుకు అనుమతించాలని విన్నవించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులపై జరుగుతున్న దాడులను, వారిని నిర్బంధిస్తున్న తీరును ఈసీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బీజేపీ నేతలను, వారి ర్యాలీలను మమత ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయాన్ని వివరించామని చెప్పారు.

ఈ సందర్భంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంపై టీఎంసీ ప్రభుత్వానికి నమ్మకం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్ లో ఇతర పార్టీలు తమ కార్యకలాపాలను చేపట్టకుండా టీఎంసీ, ఆ పార్టీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.

More Telugu News