Madhya Pradesh: చిన్నారిపై కోడిపుంజు దాడి.. కేసు నమోదు చేసి జైల్లో పెట్టిన పోలీసులు!

  • ఆడుకుంటున్న చిన్నారి బుగ్గ పొడిచిన కోడిపుంజు
  • కేసు పెట్టిన చిన్నారి తల్లిదండ్రులు
  • అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు

చిన్నారిపై దాడిచేసిన కోడిపుంజును పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పోలీసుల కథనం ప్రకారం.. శివపురికి చెందిన జాటవ్, లక్ష్మి దంపతులకు సంతానం లేకపోవడంతో ఐదేళ్ల క్రితం ఓ కోడిపుంజును తెచ్చి పెంచుకుంటున్నారు. రెండు రోజుల క్రితం పొరిగింటి చిన్నారి రాధిక రోడ్డుపై ఆడుకుంటుంటే కోడిపుంజు పాపపై దాడి చేసి బుగ్గపై పొడిచింది. దీంతో చిన్నారి బుగ్గకు గాయమైంది.

పాప ఏడుస్తూ వెళ్లి విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాటవ్ ఇంటికెళ్లి కోడిపుంజును స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన జాటవ్ భార్య లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై మండిపడింది.

కోడిపుంజు పొరపాటున చిన్నారిని గాయపరిచిందని, వదిలేయాలని కోరింది. దానిని కోడిలా చూడొద్దని, దానిని సొంత కొడుకులా పెంచుకుంటున్నామని కన్నీరు పెట్టుకుంది. దీంతో కనికరించిన పోలీసులు చిన్నారి తల్లిదండ్రులు, జాటవ్ దంపతులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించి ఇంటికి పంపారు.

More Telugu News