Hyderabad: ప్రేమకు నో చెప్పిందని కక్ష.. వరుడికి మార్ఫింగ్ ఫొటో పంపిన యువకుడు.. గుండె ఆగి మరణించిన అమ్మాయి తండ్రి

  • స్నేహాన్ని ప్రేమగా పొరబడిన యువకుడు
  • ప్రేమను నిరాకరించడంతో కక్షపెంచుకున్న యువకుడు
  •  పెళ్లిని ఆపేందుకు మార్ఫింగ్ ఫొటోను పంపిన వైనం

తన ప్రేమకు నిరాకరించినందుకు కక్ష పెంచుకున్న యువకుడు ఆమెకు కాబోయే భర్తకు మార్ఫింగ్ ఫొటో పంపించాడు. అది చూసిన అతడు పెళ్లి రద్దు చేసుకున్నాడు. విషయం తెలిసి అమ్మాయి తండ్రి గుండె ఆగి మరణించాడు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన తఫ్లీమ్.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన బంధువుల అమ్మాయి స్నేహంగా ఉండేవారు. ఆమెపై ఇష్టం పెంచుకున్న తఫ్లీమ్ ఓ రోజు తన ప్రేమ విషయాన్ని ఆమె వద్ద బయటపెట్టాడు. అతడి ప్రేమను ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్న యువకుడు  అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టాడు.  

 యువతికి ఇటీవల మరో అబ్బాయితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న తఫ్లీమ్ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి కాబోయే భర్తకు పంపించాడు. అవి చూసి నిశ్చేష్టుడైన యువతి కాబోయే భర్త పెళ్లిని రద్దు చేసుకున్నాడు. విషయం తెలిసిన యువతి తండ్రి గుండె పోటుతో మృతి చెందాడు. తనను వేధించి, ఫొటో పంపి పెళ్లి ఆపి తన తండ్రి మరణానికి కారణమైన యువకుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

More Telugu News