Chigurupati Jayaram: నీలిరంగులోకి మారిన జయరామ్ మృతదేహం... విషమిచ్చి చంపినట్టు అనుమానం!

  • సొంత కారులో విగతజీవిగా కనిపించిన చిగురుపాటి జయరామ్
  • రంగు మారిన మృతదేహాన్ని చూసిన పోలీసులకు కొత్త అనుమానం
  • ప్రస్తుతం బసవతారకం ఆసుపత్రి మార్చురీలో మృతదేహం

హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వెళుతూ, మార్గమధ్యంలో తన సొంత కారులోనే విగతజీవిగా కనిపించిన చిగురుపాటి జయరామ్ పై విష ప్రయోగం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరుగగా, ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే, ఆయన మృతదేహం నీలిరంగులోకి మారింది. ఈ విషయాన్ని ఈ ఉదయం గుర్తించిన పోలీసులు, విషమిచ్చి ఆయన్ను చంపి వుండవచ్చని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.

కాగా, కృష్ణాజిల్లా, నందిగామ సమీపంలోని ఐతవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన నిన్న తెల్లవారుజామున జయరామ్ మృత దేహం కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జయరామ్ మేనకోడలు, ఆయన నడిపిన టీవీ చానల్ ఎండీ శిఖా చౌదరిని నిందితురాలిగా భావిస్తున్న పోలీసులు, ప్రస్తుతం ఆమెను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం జయరామ్ తల్లి మరణించగా, నాటి నుంచి ఆస్తి గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News