Bontu Rammohan: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు జరిమానా విధించిన పోలీసులు!

  • నో పార్కింగ్ బోర్డు ముందు బొంతు రామ్మోహన్ కారు
  • ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టిన నెటిజన్
  • స్పందించి జరిమానా వేసిన ట్రాఫిక్ పోలీసులు

బొంతు రామ్మోహన్... హైదరాబాద్ నగర మేయర్, ప్రథమ పౌరుడి హోదాలో ఉన్న ఆయన వాహనం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో పోలీసులు జరిమానా విధించారు. 'ఏపీ 09 సీ 9969' నంబర్ గల ఫార్చ్యూనర్ కారులో మాదాపూర్ కు వెళ్లిన ఆయన, ఇనార్బిట్ మాల్ వద్ద ఉన్న ఐ ల్యాబ్ సమీపంలో నో పార్కింగ్ బోర్డు కు ఎదురుగా దాన్ని పార్కింగ్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన ఓ నెటిజన్, దాన్ని ఫోటోను తీసి, సైబరాబాద్‌ ట్రాఫిక్‌, సైబరాబాద్‌ పోలీస్‌, తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేస్తూ, ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సైబరాబాద్ కమిషనరేట్, ట్రాఫిక్ విభాగానికి రీట్వీట్ చేయడంతో, మేయర్ వాహనానికి చలానా విధించారు. చట్టం ముందు అందరూ సమానమేనని హైదరాబాద్ పోలీసులు మరోసారి నిరూపించారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా, ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో నగరావాసులు మెరుగ్గా స్పందిస్తున్నారని, ఉల్లంఘనులకు చెక్ చెప్పడంలో సహకరిస్తున్నారని పోలీసులు అంటున్నారు.

More Telugu News