Tamilnadu: మధురై కోర్టులో బట్టలిప్పి పరుగులు పెట్టిన న్యాయవాది!

  • ఓ క్లబ్ పై ఫిర్యాదు చేసిన న్యాయవాది స్వామి
  • ఆపై ఐదుగురి నుంచి బెదిరింపులు
  • భద్రత కల్పించాలంటూ నగ్నంగా పరుగులు

తనను హత్య చేస్తారని, పోలీసులు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, తమిళనాడు, మధురై కోర్టు, కలెక్టర్ ఆఫీసుల్లో ఓ న్యాయవాది బట్టలిప్పి, అటూ ఇటూ పరుగులు తీయడం తీవ్ర కలకలం రేపింది. స్వామి అనే అడ్వకేట్ ఇటీవల కొంతమందిపై ఫిర్యాదు చేస్తూ, వండియార్ ప్రాంతంలోని ఓ క్లబ్ లో మత్తు పదార్ధాలు, గంజాయి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆపై ఐదుగురు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని, తన ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో, నగ్నంగా పరుగులు తీస్తున్న స్వామిని కోర్టు ఎదుట అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్టేషన్ కు తీసుకెళ్లి, ఇలా చేయడం తప్పని హెచ్చరించి, ఫిర్యాదుపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా, కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన స్వామి, మరోసారి దుస్తులు విప్పి పరుగులు ప్రారంభించాడు. దీంతో అతన్ని మరోసారి అడ్డుకుని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ కు తరలించారు. తనను అరెస్ట్ చేసే సమయంలో వండియూర్ క్లబ్ ను మూసివేయాలంటూ నినాదాలు చేశాడు స్వామి.

More Telugu News