India: ‘నరేంద్ర మోదీ.. ఇక ఇంటికి వెళ్లు’ అని చెప్పాల్సిన సమయం వచ్చింది!: రాహుల్ గాంధీ

  • నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి
  • ప్రధానిపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ చీఫ్
  • నిరుద్యోగం జాతీయ విపత్తులా ఉందని వ్యాఖ్య

2017-18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని  జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నివేదిక విడుదల చేయడం ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈరోజు ట్విట్టర్ లో రాహుల్ స్పందిస్తూ..  ‘నమో జాబ్స్‌.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఓ నిరంకుశ నేత హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచాయి. ఉద్యోగాల విషయంలో బయటకు వచ్చిన ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ఓ జాతీయ విపత్తు వంటి పరిస్థితిని సూచిస్తోంది. గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ప్రస్తుతం నిరుద్యోగం ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి 6.5 కోట్ల మంది యువత  నిరుద్యోగులుగా ఉన్నట్లు తేలింది. నమో ఇక వెళ్లు అనాల్సిన సమయం వచ్చింది’ అని ట్వీట్ చేశారు.

మరోవైపు భారత యువత భవిష్యత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ దుయ్యబట్టింది. ‘మోదీజీ.. ప్రస్తుతం నిరుద్యోగ రేటు.. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధికంగా ఉన్నట్లు నమోదైంది. అందుకే ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదికను బయటకు రాకుండా ఇన్ని రోజులు అడ్డుకున్నారు. దీనివల్లే జాతీయ గణాంక సంఘం (ఎన్‌ఎస్‌సీ)‌ సభ్యులు ఇద్దరు రాజీనామా చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ ఇప్పుడు ఓ క్రూరమైన జోక్‌గా మారిపోయింది. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసే ప్రభుత్వం భారత్‌కు వద్దు’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. కాగా, ఎన్ఎస్‌సీ నుంచి ఇద్దరు స్వతంత్ర సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొన్ని అంశాల్లో ప్రభుత్వంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ సంస్థ తాత్కాలిక ఛైర్‌పర్సన్‌ పీసీ మోహనన్, జేవీ మీనాక్షి రాజీనామా చేశారు.

More Telugu News