Numaayish: సందట్లో సడేమియా... ఎగ్జిబిషన్ లో దొరికినవి దొరికినట్టు దోచుకెళ్లిన సందర్శకులు!

  • గత రాత్రి నుమాయిష్ లో ఘోర అగ్ని ప్రమాదం
  • మంటలు వ్యాపిస్తుంటే దొరికిన వస్తువులను దోచుకెళ్లిన వందలాది మంది
  • సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు

హైదరాబాద్ నాంపల్లిలో ఏర్పాటైన నుమాయిష్ లో గత రాత్రి జరిగిన అగ్నిప్రమాదం వందలాది మంది వ్యాపారులకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. మంటలు ఒక్కో దుకాణానికి వ్యాపిస్తుంటే, ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న వేళ, ఎంతో మంది సందర్శకులు తమకు దొరికిన వస్తువులను దొరికినట్టు దొరకబుచ్చుకుని బయటి గేట్ల వైపు పరుగులు తీశారు.

 మంటలు వ్యాపిస్తున్న వేళ, ఏ షాపునకు మంటలు అంటుకున్నాయో ఆ షాపులో దోపిడీలు జరిగినట్టు తెలుస్తోంది. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన కొన్ని సీసీటీవీ కెమెరాల్లో ఈ విషయాలన్నీ రికార్డు అయ్యాయి. షాప్ కు ఓ వైపు మంటలు అంటుకోగా, దానిపై ఎగబడ్డ పదుల సంఖ్యలో ప్రజలు, చేతికి దొరికినదాన్ని దొరికినట్టు తమ వెంట తీసుకెళ్లారు. వీటిల్లో మిక్సీలు, ఫ్యాన్ల నుంచి చిన్న చిన్న ఎయిర్ కూలర్ల వరకూ ఉండటం గమనార్హం. ఈ నష్టమంతటినీ నుమాయిష్ నిర్వాహకులు భరించాల్సిందేనంటూ స్టాల్స్ యజమానులు ఇప్పుడు నిరసనలకు దిగుతున్నారు.

More Telugu News