Thomar: వైసీపీ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం టీడీపీకి లేదు: లోకేశ్

  • తప్పుడు సర్వేలు చేస్తున్నారు
  • పాలసీ ప్రకారమే భూ కేటాయింపులు
  • బీజేపీకి అభివృద్ధి కనిపించట్లేదు

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 23 ఎంపీ స్థానాలు వస్తాయంటూ తప్పుడు సర్వేలు చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ మంత్రి తోమర్‌ను కలిసిన అనంతరం ఢిల్లీలో లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఉపాధి బకాయిలను విడుదల చేయాలని కోరామని.. మెటీరియల్ వేతనాల కింద కేంద్రం రూ.2138 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. 346 కరువు మండలాల్లో 150 రోజుల పని దినాలకు అనుమతించాలని తోమర్‌ను కోరినట్టు ఆయన తెలిపారు.

2014లో కూడా టీడీపీ ఓడిపోతుందని చాలా సర్వేలు చెప్పాయని కానీ గెలిచామని ఆయన వెల్లడించారు. వైసీపీ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం టీడీపీకి లేదని లోకేశ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి భూమి కేటాయించినప్పుడు కూడా విమర్శించారని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధి నేపథ్యంలో పాలసీ ప్రకారమే భూ కేటాయింపులు జరుగుతాయని లోకేశ్ స్పష్టం చేశారు. ఎకరం రూ.5 కోట్లకు ఇస్తే పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులే ఏపీ పనితీరు బాగుందని కితాబిస్తుంటే.. బీజేపీ రాష్ట్ర నేతలకు అభివృద్ధి కనిపించట్లేదన్నారు.

More Telugu News