Andhra Pradesh: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ బ్లేడుతో మహిళ ఆత్మహత్యాయత్నం!

  • చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఘటన
  • మోదీ ఏపీకి అన్యాయం చేశారని ఆందోళన
  • బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఓ మహిళ ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో బ్లేడుతో గొంతు కోసుకునేందుకు యత్నించగా, స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఈరోజు చోటుచేసుకుంది.

ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేశారని తిరుపతికి చెందిన దేవిరెడ్డి పద్మావతి ఈరోజు ఆందోళనకు దిగారు. మట్టి కుండ, చెంబుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంట తెచ్చుకున్న బ్లేడుతో మీడియా ముందు ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు.

పద్మావతి గొంతు కోసుకునేందుకు యత్నించగా, అక్కడే ఉన్న స్థానికులు, మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె చేతికి గాయమైంది. దీంతో పద్మావతిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

More Telugu News