modi: రైతులకు ముష్టి 8 వేలు ఇచ్చి.. అంతా బాగుందని చెప్పుకుంటున్నారు: కేసీఆర్ పై భట్టివిక్రమార్క ఫైర్

  • మోదీ, కేసీఆర్ లవి ప్రగల్భాలే
  • వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు
  • కేసీఆర్ వల్ల వ్యవసాయం భ్రష్టు పట్టింది 

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ లపై తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. వీరిద్దరివీ ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగానికి వీరు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చర్యల వల్లే దేశంలో వ్యవసాయం బతికిందని చెప్పారు. మోదీ, కేసీఆర్ లు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదని అన్నారు. అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీటిని ఇవ్వలేకపోయారని విమర్శించారు. రైతులకు ముష్టి రూ. 8 వేలు ఇచ్చి, వ్యవసాయ రంగమంతా బాగుందని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని అన్నారు. కేసీఆర్ వల్ల వ్యవసాయం భ్రష్టు పట్టిందే తప్ప లాభపడలేదని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ, భట్టివిక్రమార్క పైవ్యాఖ్యలు చేశారు. 

More Telugu News