Chandrababu: కియా పరిశ్రమపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు

  • మోదీ వల్లే కియా పరిశ్రమ వచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నారు
  • గుజరాత్, తమిళనాడులకు కియాను కేంద్రం సిఫారసు చేసింది
  • అవినీతి రహిత రాష్ట్రమనే ఏపీకి కియా వచ్చింది

ప్రధాని మోదీ వల్లే ఏపీకి కియా కార్ల పరిశ్రమ వచ్చిందంటూ బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలను కియా కోసం కేంద్ర ప్రభుత్వం తొలుత సిఫారసు చేసిందని... అయితే, అవినీతి రహిత రాష్ట్రమనే ఏపీకి కియా వచ్చిందని చెప్పారు. కాలికి బలపం కట్టుకుని పెట్టుబడుల కోసం తిరిగానని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ, బీజేపీ కుతంత్రాలు పన్నుతున్నాయని చెప్పారు. అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని తెలిపారు.

కరవుసీమలో కియా కార్లు, కృష్ణా జలాలు పరుగులు పెట్టనున్నాయని చంద్రబాబు చెప్పారు. కియా వల్ల రాష్ట్రానికి రూ. 13,500 కోట్లు, అనుబంధ కార్ల పరిశ్రమతో మరో రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కియా ద్వారా 11 వేల మందికి, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 4 వేల మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. కియాలో ఏడాదికి 3 లక్షల కార్లు తయారవుతాయని తెలిపారు.

గతంలో ఫోక్స్ వాగన్ కార్ల పరిశ్రమను వైయస్, బొత్స సత్యనారాయణలు పోగొట్టారని విమర్శించారు. ముడుపుల కోసం అధికారులను జైలుపాలు చేశారని మండిపడ్డారు. కానీ, తాను మాత్రం కార్ల పరిశ్రమను తీసుకొచ్చి, తొలి కారును విడుదల చేస్తున్నానని చెప్పారు. 

More Telugu News