Andhra Pradesh: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని డిన్నర్ కు ఆహ్వానించిన సీఎం చంద్రబాబు!

  • అమరావతిలో సీఎం నివాసంలో విందు
  • నేడు మద్దతుదారులతో టీడీపీలో చేరే ఛాన్స్
  • విజయవాడకు బయలుదేరిన సూర్యప్రకాశ్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరుతారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూర్యప్రకాశ్ రెడ్డిని డిన్నర్ కు ఆహ్వానించారు. దీంతో తన అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విజయవాడకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రమే కోట్ల ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశముందని తెలుస్తోంది.

మరోవైపు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని ఇటీవల కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోరగా, అందుకు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అంగీకరించనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోట్ల అనుచరులైన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు డి.ఖాసిం, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పి.రవీంద్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు సమర్పించారు.

కాగా, తాము వైసీపీలో చేరబోతున్నామని కోట్ల సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి ఫిబ్రవరి 6న వైసీపీలో చేరుతామని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

More Telugu News