death mistery: వీడిన యువకుడి హత్య మిస్టరీ: భార్యతో అక్రమ సంబంధం ఉందనే చంపేశాడట!

  • వరుసకు తమ్ముడైన వ్యక్తిని చంపి ఏమీ తెలియనట్టు నటించాడు
  • పోలీసుల రంగప్రవేశంతో నిజం ఒప్పుకున్న నిందితుడు
  • వీడిన విజయనగరం జిల్లాలో యువకుని హత్యకేసు మిస్టరీ

వరుసకు తమ్ముడైన వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న ఆగ్రహంతో అతన్ని చంపేశాడు. గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తిచేసి ఏమీ తెలియనట్టు అందరిలో కలిసిపోయాడు. పోలీసుల రంగ ప్రవేశంతో మిస్టరీ వీడిపోయింది. విజయనగరం జిల్లా పాచిపెంట మండం కూనబందవలస గ్రామంలో ఇటీవల హత్యకు గురైన యువకుడు చొక్కాపు బోదయ్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ఇలియాస్‌ అహ్మద్‌, ఎస్‌ఐ సన్యాసినాయుడు మీడియాకు వెల్లడించారు.

గ్రామానికి చెందిన చొక్కాపు బోదయ్య, కన్నయ్యలు వరుసకు సోదరులు. తన భార్యతో బోదయ్యకు వివాహేతర సంబంధం ఉందన్నది కన్నయ్య అనుమానం. పనుల కోసం ఏలూరు వెళ్లిన బోదయ్య పండగ ముందే గ్రామానికి వచ్చాడు. ఈనెల 8వ తేదీన బోదయ్య పాచిపెంట వెళ్లి  తిరిగి వస్తున్నాడు. తోటవలస గ్రామం దాటాక షావుకారి తోట సమీపంలో బోదయ్యను కన్నయ్య అడ్డుకున్నాడు.

తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నావని, మానుకుంటావా? లేదా? అని నిలదీశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహం తట్టుకోలేని కన్నయ్య తాను తెచ్చిన ఇనుప రాడ్డుతో బోదయ్యపై దాడి చేశాడు. దీంతో బోదయ్య అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ఏమీ తెలియనట్టు  కన్నయ్య గ్రామానికి వచ్చేశాడు.

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. ఎస్‌ఐ సన్యాసినాయుడు విచారణలో భాగంగా గ్రామానికి వెళ్లి పలు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో డాగ్‌ స్వ్కాడ్‌ తెస్తామని, దీంతో నిందితులెవరో అది కచ్చితంగా పట్టేస్తుందని చెప్పడంతో కన్నయ్యలో భయం మొదలయ్యింది. పోలీసులు వదిలే అవకాశం లేదని భావించి స్థానిక వీఆర్‌ఓ వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పేశాడు.

వీఆర్‌ఓ ఇచ్చిన సమాచారం మేరకు గ్రామానికి వెళ్లిన పోలీసులు నిందితుడు కన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతను హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News