Andhra Pradesh: ఏపీలో అదుపుతప్పి బోల్తా కొట్టిన స్కూలు బస్సు.. 50 మంది చిన్నారులకు గాయాలు!

  • గుంటూరు జిల్లాలోని వెల్దుర్తిలో ఘటన
  • ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం
  • కేసు నమోదుచేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాచర్లలోని కృష్ణవేణి ప్రైవేటు స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు బయలుదేరింది. ఈ క్రమంలో వెల్దుర్తి మండలం మండాది వాగు వద్దకు రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో బస్సు ఒక్కసారిగా బొల్తా పడింది.

ఈ ఘటనలో 50 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు బాధితులను మాచర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇధ్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరులోని జీజీహెచ్ కు తీసుకెళ్లారు.

కాగా, బాధిత చిన్నారులను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి పరామర్శించారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చిన్నారుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News