Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో పల్టీలు కొట్టిన బొలేరో వాహనం.. ఒకరి దుర్మరణం, 8 మందికి తీవ్ర గాయాలు

  • పామూరు మండలం కుంటకాడ అయ్యవారి పల్లెలో ఘటన
  • వేగంగా వెళుతూ అదుపుతప్పిన బొలేరో కారు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రకాశం జిల్లాలో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పామూరు మండలం కుంటకాడ అయ్యవారి పల్లె వద్ద వేగంగా వెళుతున్న బొలేరో వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో వెళుతున్న ఒకరు ప్రాణాలు కొల్పోగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులుు 108కు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది వీరిని హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. వలేటివారి పాలెం మండలం కుమ్మరం పాలెంకు చెందిన కార్మికులు ఈరోజు పామూరులో పనికి బయలుదేరారని తెలిపారు. అయితే కుంటకాడ అయ్యవారి పల్లె వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టిందన్నారు. ఈ ఘటనలో వలేటివారి పాలెంకు చెందిన నర్సింహారావు దుర్మరణం చెందాడన్నారు. ఈ ప్రమాదంలో మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయనీ, వారికి చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

More Telugu News