Telangana: నా డబ్బులు తీసుకుని నాకు ఓటు వేయరా.. మొత్తం వెనక్కి ఇవ్వండి!: ఓడిపోయిన అభ్యర్థి హుకూం

  • తెలంగాణలోని సూర్యాపేటలో ఘటన
  • భారీగా ఖర్చుపెట్టిన ఉప్పు ప్రభాకర్
  • ఓడిపోవడంతో ఇంటింటికి వెళుతున్న అభ్యర్థి

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అనే నానుడికి పక్కాగా సరిపోయే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డి గూడేనికి చెందిన ఉప్పు ప్రభాకర్ అనే వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా నిలబడ్డాడు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసితో డబ్బు కూడా బాగానే పంచాడు.

అయితే తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. దీంతో ఇంటింటికీ తిరిగి ఓటేయాల్సిందిగా ప్రచారం చేసిన ఉప్పు ప్రభాకర్ మరోసారి అందరి ఇళ్లకు బయలుదేరాడు. ‘నేను మీకు డబ్బులిచ్చినా నాకు ఓటేయలేదు. కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయండి’ అంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. వీలైనంత త్వరగా తన డబ్బులు వెనక్కు ఇచ్చేయాలని స్పష్టం చేశాడు. మనిషి అన్నాక విశ్వాసం ఉండాలనీ, గ్రామస్తులంతా తనను మోసం చేశారని ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

More Telugu News