Tamil Nadu: తమిళనాడులో ప్రధాని మోదీకి చేదు అనుభవం...గో బ్యాక్‌ నినాదాలు

  • ఎండీఎంకే చీఫ్‌ వైకో ఆధ్వర్యంలో నిరసనలు
  • మధురై సమీపంలోని తోప్పూరులో ఘటన
  • ఎయిమ్స్‌కు శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని

తమిళనాడు రాష్ట్రంలో ప్రధాని మోదీకి చేదు అనుభవం ఎదురైంది. మధురై సమీపంలోని తోప్పూరు వద్ద ఈ ఘటన జరిగింది. ఇక్కడ 1264 కోట్ల రూపాయలతో నిర్మించనున్న డిల్లీ తరహా ఎయిమ్స్‌ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని హాజరైన సందర్భంగా ఎండీఎంకే చీఫ్‌ వైకో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గో బ్యాక్‌ మోదీ అంటూ నినాదాలు చేశారు.

 తమిళనాడులో ఇటీవల సంభవించిన గజ తుపాన్‌ కారణంగా 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు. అంతటి విపత్తులో చిక్కుకున్నా బాధితులకు సాయం చేయకుండా, వారిని పరామర్శించకుండా ప్రారంభోత్సవానికి మాత్రం రావడంపై పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని తమిళనాడులో పర్యటించడంతో నిరసనకారులు తమ గళం వినిపించారు.

కాగా, ఈ పర్యటనలో ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, రాధాకృష్ణన్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

More Telugu News