Anantapur District: రైలులో అనంతపురం నుంచి అలెప్పి చేరుకున్న మతిస్థిమితం లేని మహిళ

  • గుర్తించిన కేరళ పోలీసులు
  • కేరళ స్త్రీసంరక్షణ కేంద్రానికి తరలింపు
  • వివరాలు రాబడుతున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురంలో మతిస్థిమితం లేని ఓ మహిళ రైలెక్కి కేరళ రాష్ట్రంలోని అలెప్పీ చేరింది. అక్కడ దిక్కుతోచని స్థితిలో దీనంగా ఎదురు చూస్తున్న ఈ మహిళను పోలీసులు గుర్తించారు. ఆమె మాటలను బట్టి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే సదరు మహిళ తన వివరాలను సరిగా చెప్పలేకపోతుండడంతో ఎక్కడి నుంచి వచ్చిందన్న దాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయారు.

దీంతో స్థానిక కలెక్టర్‌ కృష్ణతేజ తాత్కాలికంగా ఆమెను అలెప్పిలోని జిల్లా స్త్రీ శిశు సంరక్షణ కేంద్రానికి పంపించారు. రెండు నెలల నుంచి అక్కడే ఉన్న ఆమెను స్వస్థలం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నా వీలు కావడం లేదు. కౌన్సెలింగ్‌ ద్వారా స్వల్ప వివరాలు లభ్యమైనప్పటికీ కచ్చితంగా ఆమె స్వస్థలం వివరాలు తెలియక పోవడంతో పంపించడం వీలు కావడం లేదని కలెక్టర్‌ తెలిపారు. ఆమె వివరాలు తెలుసుకుని పంపించేందుకు పోలీసులు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.

More Telugu News