Republic Day: గణతంత్ర వేడుకల్లో సత్తా చాటిన బస్ కండక్టర్ కుమార్తె!

  • అసోం రైఫిల్స్‌కు సారథ్యం వహించిన మేజర్ ఖుష్బూ కన్వర్
  • దేశం దృష్టిని ఆకర్షించిన ఐదుగురు వనితలు
  • గణతంత్ర వేడుకల చరిత్రలోనే ఇదే తొలిసారి

ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఓ బస్ కండక్టర్ కుమార్తె సత్తా చాటారు. దేశంలోనే అతి పురాతనమైన ఆల్-విమెన్ అసోం రైఫిల్స్ పారామిలటరీ దళానికి మేజర్ ఖుష్బూ కన్వర్ నాయకత్వం వహించారు. మొత్తం మహిళలతో కూడిన బృందం కవాతు నిర్వహించడం దేశ గణతంత్ర చరిత్రలో ఇదే తొలిసారి.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన కన్వర్ ఓ బిడ్డకు తల్లి. 2012లో ఆర్మీలో చేరారు. ఆమె తండ్రి ఓ బస్ కండక్టర్. కవాతు అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆల్-విమెన్ అసోం రైఫిల్స్ దళానికి సారథ్యం వహించినందుకు గర్వంగా ఉందన్నారు. ఓ బస్ కండక్టర్ కుమార్తెగా ఈ ఘనతను సాధించానని,  ఎవరైనా తన కలలను నిజం చేసుకోవచ్చని నిరూపించానని పేర్కొన్నారు. కాగా, రిపబ్లిక్ డే కవాతులో మహిళా శక్తి అడుగడుగునా కనిపించింది.

అందరూ పురుషులే ఉన్న బృందాలకు కూడా మహిళలు నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్‌ భావనా కస్తూరి, కెప్టెన్‌ శిఖా సురభి, మేజర్‌ ఖుష్బూ కన్వర్‌, లెఫ్టినెంట్‌ అంబికా సుధాకరన్‌, కెప్టెన్‌ భావనా స్యాల్‌‌లు తమ విభాగాలకు నేతృత్వం వహించి దేశం దృష్టిని ఆకర్షించారు.

More Telugu News