nikhil: హీరో నిఖిల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు: నిర్మాత నట్టి కుమార్ ధ్వజం

  • 'ముద్ర' టైటిల్, లోగో విషయంలో నిఖిల్, నట్టి కుమార్ ల మధ్య వివాదం
  • తన లోగోను వాడుకుంటున్నారన్న నిఖిల్
  • టైటిల్ నాదే అంటున్న నట్టి కుమార్

'ముద్ర' అనే సినిమాతో యంగ్ హీరో నిఖిల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తన సినిమా లోగో, పేరు వాడుకుని మరో సినిమాను విడుదల చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నిఖిల్ మండిపడ్డాడు.

నిఖిల్ కామెంట్లపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. 'ముద్ర' టైటిల్ తనదేనని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపారు. నిర్మాతలపై నిఖిల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు. టైటిల్ తనదేనని నిఖిల్ నిరూపించుకోవాలని... లేనిపక్షంలో సినిమాల నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని చెప్పారు. సినిమా చూడొద్దని నిఖిల్ ఎలా చెబుతాడని ప్రశ్నించారు. చిన్న నిర్మాత ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఏమిటని అడిగారు.

సోమవారంలోపు నిఖిల్ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే అతని బండారం బయటపెడతానని నట్టి కుమార్ హెచ్చరించారు. ఈ అంశంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తామని, అన్ని విషయాలను తేలేంత వరకు నిఖిల్ సినిమా నిలిపేయాలని డిమాండ్ చేశారు.

జగపతిబాబు ప్రధాన పాత్రలో 'ముద్ర' అనే సినిమాను నట్టి కుమార్ నిర్మించారు. దీనికి సంబంధించిన లోగోను కూడా నిఖిల్ సినిమాకు చేసినట్టే డిజైన్ చేశారు. దీంతో, నిఖిల్ సినిమా అనుకుని ఈ సినిమాకు నెటిజన్లు ఆన్ లైన్లో టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో, ఈ వారంలో తన సినిమా విడుదల కావడం లేదని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కొంత మంది వ్యక్తులు వాళ్ల సినిమాకు కావాలనే తన సినిమా టైటిల్ ను సేమ్ డిజైన్ తో వాడుతున్నారని... టికెట్ బుకింగ్ యాప్ లో తన పేరును కూడా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డాడు. ఆ వ్యక్తులపై తమ నిర్మాతలు చర్యలకు సిద్ధమవుతున్నారని చెప్పాడు.

More Telugu News