Andhra Pradesh: జగన్ ఆంధ్రప్రదేశ్ ను బిరియానిలా తినేయబోతున్నారు!: నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

  • డబ్బులు తీయాలా అని జగన్ చెబుతున్నారు
  • నాలుగింతలు సంపాదిస్తామని అంటున్నారు
  • వీడియో విడుదల చేసిన మెగాబ్రదర్

మై ఛానల్ నా ఇష్టం పేరుతో మెగాబ్రదర్ నాగబాబు అధికార టీడీపీ, విపక్ష వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. హీరో నందమూరి బాలకృష్ణ, వైసీపీ అధినేత జగన్ పై పలు వీడియోలను విడుదల చేసిన నాగబాబు తాజాగా జగన్ పై మరో వీడియోను రిలీజ్ చేశారు. ‘రెండేళ్లు ఓపిక  పట్టండి. మీరు పోగొట్టుకున్నదానికి నాలుగింతలు వచ్చేట్లు చేస్తా. రెండేళ్లు ఓపిక పడితే మన ప్లేట్లో మన బిరియాని మనమే తినొచ్చు’ అని జగన్ గతంలో పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను కోట్ చేశారు. అలాగే ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా ‘ఎన్నికల్లో డబ్బులు తీయ్యాలా’ అని జగన్ అంటున్న మరో వీడియోను ఇందులో చూపించారు.

రాబోయే ఎన్నికల్లో గెలిచి ఏపీని బిరియానీలా తినేద్దామని జగన్ ప్లాన్ వేశారని నాగబాబు విమర్శించారు. జగన్ కు తోడుగా ఆయన అనుచరులు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. తాను ఇంతకుముందు విడుదల చేసిన వీడియోలో జగన్ వ్యాఖ్యలను సరిగ్గా అర్ధం చేసుకోలేదని కొందరు నెటిజన్లు చెప్పారన్నారు. ‘2014 ఎన్నికల్లో ఒకడు 5 కోట్లు ఖర్చు పెట్టి పోయినయ్ అనుకోండి. ఇప్పుడు 5కోట్లో, 10కోట్లో ఖర్చు పెడతాడు. అంటే ఉదాహరణకు 15 కోట్లు అవుతుందనుకుంటే.. ఎన్నికల తర్వాత నాలుగురెట్లు సంపాదించుకోవచ్చని జగన్ చెప్పినదాని ప్రకారం రూ. 60 కోట్లు అవుతుంది. అంటే రూ.75 కోట్లు (15 ప్లస్ 60) సంపాదించుకోవచ్చని జగన్ చెబుతున్నారా?’ అని ప్రశ్నించారు.

ఇంత క్లారిటీ, విజన్ ఉన్న నాయకుడు దేశంలో ఎక్కడ దొరుకుతాడని ప్రశ్నించారు. జగన్ కు అసాధారణ విజన్ ఉందనీ, ఇలాంటి నాయకుడు దేశంలో ఎక్కడా దొరకడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టే నాయకుడు కావాలా? లేక ఇలాంటి నాయకులు కావాలో ప్రజలే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలపై జగన్ కు ఉన్న ప్రేమ ఇదేనని విమర్శించారు.

More Telugu News