me too: ‘రాత్రి పడుకోవడానికి ఎంత తీసుకుంటావ్ అంటూ వేధిస్తున్నారు’!: గాయని చిన్మయి సంచలన వ్యాఖ్యలు

  • సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు
  • వైరముత్తు మాత్రం సన్మానాలు అందుకుంటున్నారు
  • హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన సింగర్

సినీపరిశ్రమలో లైంగిక వేధింపులను బయటపెట్టినందుకే తనకు అవకాశాలు రాకుండా చేశారని నేపథ్య గాయని, చిన్మయి శ్రీపాద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గొంతెత్తి మాట్లాడినందుకు తనకు అవమానాలు, హేళనలు ఎదురయ్యారని వాపోయారు. తనను డబ్బింగ్ యూనియన్ నుంచి బహిష్కరించారనీ, అదే సమయంలో గేయ రచయిత వైరముత్తు మాత్రం గొప్ప వ్యక్తిగా చలామణి అవుతూ సత్కరాలు, సన్మానాలు పొందుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

భారత సమాజంలో బాధితురాలికి న్యాయం జరగడం అంత సులభం కాదని చిన్మయి వ్యాఖ్యానించారు. బాధితురాలు చనిపోతే, హత్యకు గురయితేనే సమాజం సీరియస్ గా పట్టించుకుంటుందని ఆమె దుయ్యబట్టారు. ప్రస్తుతం తాను సోషల్ మీడియా నుంచి అన్నిరకాల వేధింపులను ఎదుర్కొంటున్నానని వాపోయారు. తనను దూర్భాషలాడుతూ ట్రోలింగ్ చేస్తున్నారనీ, ‘నాతో పడుకోవడానికి ఎంత తీసుకుంటావు’ అని పిచ్చిపిచ్చి సందేశాలతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరైతే తనను వ్యభిచారిణి అంటూ దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఇప్పటివరకూ 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఐదు రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నానని చిన్మయి తెలిపారు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో గాయనిగా పేరు తెచ్చుకున్నాననీ, తాను సంచలనాల కోసం ఎందుకు ఆరోపణలు చేస్తానని ప్రశ్నించారు. అమ్మాయిలపైనే కాదు, చిన్నవయసు అబ్బాయిలపైనా అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

రాజకీయ పలుకుబడితో చాలామంది దోషులు తప్పించుకుంటున్నారని అన్నారు. ఇటీవల వైరముత్తు పుస్తకావిష్కరణ సభకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి హాజరయ్యారని చిన్మయి తెలిపారు. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తుల కార్యక్రమాలకు వెళ్లడం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయో నాయకులు ఆలోచించాలని సూచించారు. తన భర్త రాహుల్ రవీంద్రన్ సాయం వల్లే తాను సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై ధైర్యంగా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

More Telugu News