Priyanandan: మలయాళ సినీ దర్శకుడు ప్రియానందన్‌పై ఆవుపేడతో దాడి.. ముఖ్యమంత్రి ఖండన

  • పాల కోసం వెళ్లిన ప్రియానందర్
  • బీజేపీ నాయకులే దాడి చేశారని ఆరోపణ
  • దాడులను సహించేది లేదన్న సీఎం

ఇటీవల జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ దర్శకుడు ప్రియానందన్‌ శబరిమల గురించి ఫేస్‌బుక్ ఖాతాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వ్యాఖ్యలు హిందూత్వాన్ని అవమానపరిచేలా ఉన్నాయంటూ కొందరు ఆ పోస్టులను తొలగించేలా చేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఆయనపై కొందరు దాడి చేశారు. త్రిశూర్ పోలీసుల కథనం ప్రకారం.. నేటి ఉదయం ఆయన పాలు తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై ఆవు పేడతో దాడి చేశారు.

ఈ విషయమై ప్రియానందన్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులే ఈ పని చేయించారని ఆరోపించారు. దాడి అనంతరం స్థానికులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ప్రియానందన్ త్రిశూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఈ దాడి గురించి తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రనగా ఖండించారు. ప్రియానందన్‌పై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రతి వ్యక్తికి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందని.. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు.  

More Telugu News