Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసిన ప్రత్యేక కోర్టు!

  • ముగిసిన శ్రీనివాసరావు కస్టడీ
  • భద్రత కల్పించాలన్న న్యాయవాది సలీం
  • గతేడాది అక్టోబర్ 25న జగన్ పై దాడి

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసులో విచారణ వాయిదా పడింది. ఈ కేసును వచ్చే నెల 9కి వాయిదా వేస్తున్నట్లు విజయవాడలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తెలిపారు. కస్టడీ ముగిసిపోవడంతో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు ఈరోజు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదిస్తూ.. శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉన్నందున రాజమండ్రి జైలులో ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని కోరారు. అలాగే జైలులో శ్రీనివాసరావుకు పెన్ను, పుస్తకం అందించాలని విన్నవించారు. ఇందుకు అంగీకరించిన కోర్టు.. శ్రీనివాసరావును వచ్చే నెల 8వ వరకూ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. కత్తి ఎడమ భుజం సమీపంలో లోతుగా దిగడంతో జగన్ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

More Telugu News