Krishna: త్వరలో టీడీపీలో చేరనున్నా: సూపర్ స్టార్ మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావు

  • తెనాలి సీటు అడిగిన ఆదిశేషగిరిరావు 
  • ఇటీవలే వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేసిన కృష్ణ సోదరుడు
  • చంద్రబాబును కలిసి చర్చించిన ఆదిశేషగిరిరావు

తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నానని హీరో కృష్ణ సోదరుడు, మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రకటించారు. నిన్నమొన్నటి వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన, తెనాలి ఎంపీ స్థానాన్ని ఆశించగా, జగన్ నుంచి ఎటువంటి భరోసా రాకపోవడంతో, ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఆపై నేడు చంద్రబాబును కలిసి దాదాపు అరగంటకు పైగా చర్చించిన ఆయన, తన రాజకీయ భవిష్యత్ పై హామీ తీసుకున్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుతో బయటకు వచ్చిన అనంతరం ఆదిశేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ, కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘాలతో చర్చించిన తరువాతే, వైసీపీని వీడానని, త్వరలో టీడీపీలో చేరుతానని అన్నారు.

కాగా, ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయునిగా, కాంగ్రెస్ పార్టీ నేతగా ఒకప్పుడు నిలిచిన హీరో కృష్ణ క్రియాశీల రాజకీయాలకు చాన్నాళ్లుగా దూరంగా ఉంటుండగా, మహేశ్ బాబు, 2014 ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా నిలబడిన తన బావ గల్లా జయదేవ్ ను గెలిపించాలని ఫ్యాన్స్ కు పిలుపునివ్వడం మినహా, మరెక్కడా రాజకీయాల్లో కనిపించలేదు.

More Telugu News