Asaduddin Owaisi: ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టిన గోరక్షక ముఠా.. తీవ్రంగా స్పందించిన ఒవైసీ!

  • హరియాణాలోని రోహతక్ లో ఘటన
  • యువకుడిని చావబాదిన దుండగులు
  • ప్రధానిని నిలదీసిన మజ్లిస్ అధినేత

బీజేపీ పాలిత హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. రోహతక్ లో గేదెలను ఓ మార్కెట్ లో అమ్మేందుకు తీసుకెళుతున్న నౌషాద్ అనే ముస్లిం యువకుడిని గోరక్షక ముఠా విచక్షణారహితంగా చావగొట్టింది. స్తంభానికి కట్టేసి రెండు గంటల పాటు కర్రలు, రాడ్లతో రక్తం కారేలా కొట్టారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు సదరు యువకుడికి ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా బేడీలు వేసి రెండ్రోజులు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. చివరికి మానవహక్కుల సంస్థలు జోక్యం చేసుకోవడంతో ఆ యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

‘‘ఇలాంటి అమానవీయ ప్రవర్తనను ఎదుర్కొన్న నౌషాద్ కు సహనం, ఓపిక ఇవ్వాలని ఆ అల్లాహ్ ను కోరుతున్నా. మూకహత్యలను బహిరంగంగా ఖండించలేని ప్రధాని ఉన్నప్పుడు ఈ దారుణాలు ఎలా ఆగుతాయి? ఆయన ప్రతీ సందర్భంలోనూ ‘సెంటిమెంట్లను గౌరవించాలి’ అని వల్లెవేస్తుంటారు’’ అని ట్విట్టర్ లో మండిపడ్డారు.

More Telugu News