Gali Janardhan Reddy: నా స్నేహితుడిని ఆ స్థితిలో చూసిన తరువాత కళ్లల్లో నీళ్లాగలేదు: గాలి జనార్దన్ రెడ్డి

  • తోటి ఎమ్మెల్యే దాడి ఘటనలో గాయపడిన ఆనంద్ సింగ్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే పరామర్శించిన గాలి
  • దాడి విషయంలో శివకుమార్ అసత్యాలు చెబుతున్నారని ఆరోపణ

తన ఆత్మీయ స్నేహితుడు, సహచర ఎమ్మెల్యే దాడిలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోస్ పేట ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ను చూసి తన కళ్లలో నీరు ఆగలేదని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆనంద్ సింగ్ ను పరామర్శించి వచ్చిన ఆయన, జరిగిన దాడి ఘటన విషయంలో డీకే శివకుమార్ అవాస్తవాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు.

ఆనంద్ సింగ్ తలకు, కంటికి గాయాలు అయ్యాయని చెప్పిన ఆయన, కంప్లి ఎమ్మెల్యే గణేష్ చేసిన పని సరికాదని అన్నారు. దాడి తరువాత అదే రోజు ఆనంద్ సింగ్ ను వైద్యులు డిశ్చార్జ్ చేస్తారని శివకుమార్ చెబితే, సాయంత్రం ఆయనకు బిర్యానీ పార్టీ ఇస్తానని మరో మంత్రి జమీర్ అహ్మద్ అన్నారని, కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని గాలి వ్యాఖ్యానించారు.

ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఆయన్ను చూస్తుంటే, ఆయన ఇప్పట్లో డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ఎమ్మెల్యేల వద్ద ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డీకే శివకుమార్ లు ఇటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News