Jagan: వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నాగబాబు

  • జగన్‌ను టార్గెట్ చేసిన మెగా బ్రదర్
  • చంద్రబాబును చూసి జగన్‌కు అసూయ
  • రాజకీయ విమర్శలు కొనసాగుతాయన్న నాగబాబు

నిన్నమొన్నటి వరకు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసిన నటుడు నాగబాబు నిన్న లోకేశ్‌పై పడ్డారు. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ‘మై చానల్ అంతా నా ఇష్టం’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించిన నాగబాబు ఓ వీడియోను పోస్టు చేశారు. రాజకీయంగా తన విమర్శలు కొనసాగుతాయని అందులో పేర్కొన్న ఆయన ఏపీ మంత్రి నారా లోకేశ్ చిన్న పిల్లాడంటూ ఎద్దేవా చేశారు.

జగన్ ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ.. జగన్ తన మనసులోని భావాన్ని బయటపెట్టేశారని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదని అన్నారు. ఎవరైనా ఓ వ్యక్తి ‘వీడు నా కన్నా గొప్పవాడు’ అని అన్నాడంటే దానర్థం అతడు కూడా గొప్పవాడేనని, అతడి కంటే ఇతడు ఇంకా గొప్పవాడని అర్థమని పేర్కొన్న నాగబాబు.. ఇదే విషయాన్ని జగన్‌కు ఆపాదించారు.  

ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన దాంట్లోనూ ఇదే కనిపిస్తోందని నాగబాబు అన్నారు. తనకో స్టేజ్ ఉందని, తనకో స్థాయి ఉందని పేర్కొన్న జగన్ తనమీద కొన్ని కేసులు కూడా ఉన్నాయని చెప్పారని నాగబాబు గుర్తుచేశారు. చంద్రబాబు తన రేంజ్‌ను మించిపోయారని అన్నారని, అంటే చంద్రబాబును చూసి జగన్ అసూయ చెందుతున్నట్టేనని వివరించారు. ఒక వ్యక్తిని వీడు నా కంటే పెద్ద వెధవ అంటే.. దానర్థం అతడు కూడా వెధవేనని అర్థమంటూ లాజిక్ చెప్పుకొచ్చారు.

More Telugu News