bachula arjunudu: వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. జగన్ జైలుకు పరిమితమవుతారు: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

  • వంగవీటి రాధాను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం
  • మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారు
  • ప్రజలందరికీ సమన్యాయం చేసేది చంద్రబాబు మాత్రమే

వైసీపీ మాజీ నేత వంగవీటి రాధాకృష్ణ ఈనెల 25న టీడీపీలో చేరనున్నారని... పార్టీలోకి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ, వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఆ పార్టీ నుంచి మరి కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు టీడీపీలో చేరబోతున్నారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ రానున్న రోజుల్లో జైలుకే పరిమితమవుతారని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసేది కేవలం చంద్రబాబేనని, అలాంటి నాయకుడిని మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని వాటిని కూడా చంద్రబాబు నెరవేర్చారని తెలిపారు. రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

More Telugu News