mahabubnagar district: అనుమానంతో వితంతువైన కోడలిని హత్య చేసిన మామ

  • అనంతరం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘటన
  • భర్త చనిపోవడంతో మామతోనే కలిసి ఉంటున్న మృతురాలు

కోడలిపై అనుమానంతో ఆమె మామ దారుణానికి ఒడిగట్టాడు. బుధవారం తెల్లవారు జామున ఆమెను రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండలంలోని ముడుమూల్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి.

 గ్రామానికి చెందిన పోతుల శాంతప్ప పెద్ద కొడుకు మహదేవ్‌, లక్ష్మి (33) దంపతులు. పదేళ్ల క్రితం వీరికి వివాహం కాగా, ఒక కొడుకు ఉన్నాడు. అనారోగ్యం బారిన పడిన మహదేవ్‌ ఆరేళ్ల క్రితం చనిపోయాడు. భర్త చనిపోయినా లక్ష్మి పుట్టింటికి వెళ్లకుండా మామ పోతుల శాంతప్ప ఇంట్లోనే ఉంటోంది. ఆమె కొడుకు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు.

లక్ష్మిపై అనుమానం పెంచుకున్న శాంతప్ప గత కొంతకాంగా ఆమెను వేధిస్తున్నాడు. ఈ నేపధ్యంలో బుధవారం తెల్లవారు జామున రోకలి బండతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నిందితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు. ఎస్‌ఐ నరేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News