Andhra Pradesh: జోరు పెంచిన పవన్ కల్యాణ్.. నేడు పాడేరులో జనసేన బహిరంగ సభ!

  • గిరిజన సమస్యలను ప్రస్తావించనున్న జనసేనాని
  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నేతలతో భేటీ
  • వామపక్షాలతో ఈ నెల 25న సమావేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచారు. ఇందులో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వెళ్లనున్న పవన్.. అక్కడ పాడేరులో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకోసం అంబేద్కర్ కూడలిలో ఏర్పాట్లను జనసేన నేతలు పూర్తిచేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, అభివృద్ధి, సాధికారతను పవన్ ప్రధానంగా ప్రస్తావించే అవకాశముంది.

అనంతరం రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నేతలతో పవన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరుసటి రోజు అంటే ఈ నెల 25న విశాఖపట్నంలో వామపక్ష పార్టీల నేతలతో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో సమావేశమై రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు.

More Telugu News